విస్సన్నపేటలో నీటి లీకేజీతో వృథాగా తాగునీరు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట ఒకవైపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు పంచాయతీ వాటర్ పైప్లైన్ లీకేజీ కారణంగా విలువైన తాగునీరు వృథాగా పారిపోతోంది. విస్సన్నపేట–సత్తుపల్లి రోడ్డులో పెద్ద చెరువు కట్ట సమీపంలో పైప్లైన్ దెబ్బతినడంతో గత మూడు గంటలుగా నీరు నిరంతరాయంగా ప్రవహిస్తోంది.
లీకేజీ కారణంగా చెరువు కట్ట బలహీనపడే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు, ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి, లీకేజీని మరమ్మతు చేసి తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
నీటి సంరక్షణపై అవగాహన పెంచుతున్న తరుణంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.