వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్కు షాక్.. సర్వీస్ నుంచి డిస్మిస్..!
వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్కు షాక్.. సర్వీస్ నుంచి డిస్మిస్..!
కర్నూలు ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న హరిప్రసాద్ను సర్వీస్ నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లాకు చెందిన హరిప్రసాద్ 2012 బ్యాచ్ ఎస్సైగా పోలీస్శాఖలో చేరి, నంద్యాల జిల్లాలో ఎక్కువకాలం విధులు నిర్వర్తించారు. అయితే వరుస వివాదాలు ఆయన కెరీర్ను కుదేలు చేశాయి.
గతంలో ఆళ్లగడ్డ రూరల్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ను వేధించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేస్తూ మంత్రి లోకేష్కు పంపడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ ఘటనపై అప్పట్లో డీజీపీ స్పందించి హరిప్రసాద్ను సస్పెండ్ చేశారు. అనంతరం సస్పెన్షన్ ఎత్తివేయడంతో చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహించి, ఇటీవల కర్నూలు ట్రాఫిక్ పోలీస్స్టేషన్కు బదిలీ అయ్యారు.
అయితే అక్కడ కూడా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ యువతిని మాయమాటలతో దగ్గరై, మూడేళ్ల పాటు సన్నిహితంగా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. తర్వాత యువతి దూరంగా ఉండటంతో ఆమెను వేధించడం, బెదిరింపులకు దిగడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అంతేకాక యువతితో ఉన్న వ్యక్తిగత ఫోటోలను ఆమెకు నిశ్చయమైన వరుడికి పంపడంతో పెళ్లి ఆగిపోయిందని సమాచారం.
దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో హరిప్రసాద్పై కఠిన చర్యలు తీసుకుంటూ ఏకంగా సర్వీస్ నుంచి తొలగించారు. గతంలో సస్పెన్షన్ ఎదురైనా ప్రవర్తన మార్చుకోకపోవడంతో చివరికి ఉద్యోగాన్నే కోల్పోయిన అధికారిగా హరిప్రసాద్ నిలిచిపోయారు.