వల్లంపట్ల పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా, ఏ.కొండూరు మండలం వల్లంపట్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విలేజ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఇంజనీర్ కుటుంబ నాగేశ్వరరావు విద్యార్థులకు 32 స్టీల్ వాటర్ బాటిల్స్ అందజేశారు. మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) కేశవరావు చేతుల మీదుగా విద్యార్థులకు బాటిల్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ కేశవరావు మాట్లాడుతూ, ప్రతిరోజూ తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపారు. స్టీల్ వాటర్ బాటిల్స్ వినియోగం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించి, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుని తమ గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు భూక్య సుబ్రహ్మణ్యం, శ్రీకాకుళపు శామ్యూల్ విద్యార్థులతో కలిసి కుటుంబ నాగేశ్వరరావు సేవాభావాన్ని అభినందించారు. స్వగ్రామ అభివృద్ధి కోసం ముందుకు వచ్చి విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను అందించడం ఆదర్శప్రాయమని కొనియాడారు.
ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆనందాన్ని నింపడంతో పాటు, సమాజ సేవకు ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.