వరి కొయ్యలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై డి. నాగరాజు
రైతు సోదరులు పొలాల్లో వరి కోతల అనంతరం మిగిలిన ఎండిన వరి కొయ్యలకు (రైస్ స్ట్రా) నిప్పు పెట్టవద్దని రామన్నపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ డి. నాగరాజు గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వేసవి కాలంలో వేడి గాలులు తీవ్రంగా వీస్తున్నందున, పొలాల్లో పెట్టే మంటలు క్షణాల వ్యవధిలో విస్తరించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై నాగరాజు మాట్లాడుతూ ఎండిన వరి కొయ్యలకు, ఇళ్ల సమీపంలో ఉన్న చెత్తాచెదరానికి నిప్పు పెట్టడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. వేడి గాలుల తీవ్రతకు మంటలు ఎగిసిపడి, పక్కనే ఉన్న గడ్డివాములకు, నివాస గృహాలకు అంటుకునే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. దీనివల్ల భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించే ముప్పు ఉందని, రైతులు, గ్రామస్థులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, చేతులారా ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు. ప్రకృతిని కాపాడితే అది మన ప్రాణాలను కాపాడుతుంది. మన గ్రామాన్ని పచ్చగా, సురక్షితంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత" అని ఆయన పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా వరి కొయ్యలకు నిప్పు పెడితే పర్యావరణ పరిరక్షణ చట్టం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇలాంటి ఉల్లంఘనలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.