వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : వ్యవసాయ అధికారి గిరిబాబు
ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా పడక మండలంలో ప్రత్తి పంట ఎదుగుదల లేక, వరి నాట్లకు నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చిట్యాల మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు తెలిపారు. బుధవారం గుండ్రంపల్లి రైతు వేదికలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు వరి నాట్లను తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు.చిరుధాన్యాలు , ఆరుతడి పంటలు అయిన కంది, పెసలు, మినుములు, ఉలవలు, అలసందలు, జొన్న, సజ్జలు, రాగులు, నూనె గింజలైన ఆముదం, పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశనగ వంటి పంటలను పండించాలని తెలిపారు. అంతేకాకుండా తక్కువ నీటితో పండే కూరగాయ పంటలు టమాటా, వంకాయ, గోకర, బెండకాయ సాగు చేస్తే మార్కెట్లో మంచి డిమాండ్ ద్వారా ఆదాయం ఉంటుందని తెలిపారు.జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు అన్యధా ఫుడ్స్ ఆధ్వర్యంలో చిట్యాల మండలం పైలట్ ప్రాజెక్ట్గా ఎంపికైంది ఈ సందర్భంగా వెల్లడించారు. వరికి కావాల్సిన నీటిలో మూడో వంతు నీటితోనే జనపనార పండుతుంది. ఎకరానికి రూ. 180లకే సబ్సిడీ విత్తనాలు ఇస్తారని, పంటను అన్యధా ఫుడ్స్ బైబ్యాక్ ఒప్పందంతో కొనుగోలు చేస్తుందని తెలిపారు. పంట సాగులో సాంకేతిక సలహాల కోసం డైరెక్టర్ డాక్టర్ టి పి ప్రసన్నకుమార్,(9121185151) లేదా స్థానిక ఏఈఓ లను సంప్రదించవచ్చని తెలిపారు. గుండ్రంపల్లి, సుంకనపల్లి రైతులు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కింద సహజ వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలని, వారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని కోరారు.
ఈ కార్యక్రమంలో సహజ వ్యవసాయ రైతులు నాగలక్ష్మి, గోపగోని కవిత, మైల నరసింహ తమ అనుభవాలను పంచుకోగా.. సుంకనపల్లి సర్పంచ్, వార్డు మెంబర్లు, పిఎసిఎస్ డైరెక్టర్ బొడిగె సైదులు, ఏఈఓ నవీన్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.