www.ntodaynews.com
జాతీయ రహదారిని 8 లైన్లుగా విస్తరిస్తాం
తెలంగాణ
జాతీయ రహదారిని 8 లైన్లుగా విస్తరిస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
చిట్యాలలో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పరిశీలన NTODAY NEWS: చిట్యాల 65వ నంబర్ జాతీయ రహదారిని 8 లైన్లుగా విస్తరిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 65వ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కోసం 17 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం విస్తరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వనస్థలిపురం, అబ్దులపూర్ మెట్, ఆర్ఎఫ్సీ ప్రాంతాల్లో కూడా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.
గత ఏడాది సంక్రాంతి సందర్భంగా 9 లక్షల 97 వేలకుపైగా వాహనాల రాకపోకలు జరిగాయని, అప్పటి అనుభవాల ఆధారంగా ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పెద్ద కాపర్తి, చిట్యాల, కోర్లపహాడ్ ప్రాంతాల్లో ప్రయాణికులు ప్రశాంత వాతావరణంలో ప్రయాణించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రవాణా శాఖలతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ జామ్లు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
65వ జాతీయ రహదారిని 8 లైన్లుగా విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధం చేశామని, మార్చి నెలలో టెండర్లు పిలిచి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చడం శుభపరిణామమని, నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, డిటిసి వాణి తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube