యూనియన్ బ్యాంకు ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ధర్నా!
SBI తరహాలోనే రూ. 50 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్
మంచిర్యాల ప్రతినిధి (జూలై 13): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తరహాలోనే యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు, కోల్ మైన్స్ పెన్షన్ దారులకు రూ. 50 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంకు కార్యాలయం ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గుల్షన్ కుమార్కు అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ... గత రెండు నెలలుగా యూనియన్ బ్యాంక్ అధికారులను కలిసి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నప్పటికీ వారి నుండి సరైన స్పందన రాలేదని, అందుకే ఈ నిరసన చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. ప్రమాద బీమా విషయమై 15 రోజుల్లో స్పష్టమైన వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ గుల్షన్ కుమార్కు వివరించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షులు ఏ. గంగయ్య, పి. రాంరెడ్డి పాల్గొనగా, ముఖ్య నాయకులు పోతురాజుల చంద్రయ్య, ఇరుకుళ్ల జనార్దన్, ఎన్నం శంకర్, టి. జనార్దన్ స్వామి, శశాంక్ రావు, బి. కృష్ణ, ఎస్. ఘటయ్య, కనిగంటి లచ్చయ్య, కాటం లక్ష్మణ్ తదితర విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు