మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిన ఎక్స్రే సేవలు: రోగుల తీవ్ర అవస్థలు
మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎక్స్రే యంత్రాలు వరుసగా చెడిపోతుండటంతో పేద రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొదట ప్రధాన ఆసుపత్రిలోని ఎక్స్రే మిషన్ పనిచేయకపోవడంతో, ప్రత్యామ్నాయంగా రోగులను మాతా-శిశు సంరక్షణ ఆసుపత్రికి (MCH) తరలించి సేవలు అందించారు. అయితే తాజాగా అక్కడ ఉన్న ఎక్స్రే యంత్రం కూడా సాంకేతిక లోపంతో పూర్తిగా మొరాయించడంతో ప్రభుత్వ వైద్య సేవలు మరింత కుంటుపడ్డాయి.
ప్రస్తుతం రెండు ఆసుపత్రుల్లోనూ సేవలు నిలిచిపోవడంతో అధికారులు రోగులను టీ-హబ్ (T-Hub) కేంద్రానికి తరలించి ఎక్స్రేలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాల బారిన పడి అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులు, గర్భిణులు, వృద్ధులు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ ల్యాబ్లలో వేల రూపాయలు ఖర్చు చేయలేని పేద రోగుల పరిస్థితి దయనీయంగా మారిందని, అధికారులు తక్షణమే స్పందించి దెబ్బతిన్న ఎక్స్రే యంత్రాలకు మరమ్మతులు చేపట్టి సాధారణ సేవలను పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు