ఊటుకూరులో రూ.95 లక్షలతో ఏసీ కళ్యాణ మండపం ప్రారంభం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో సెంట్రల్ బ్యాంక్ సహకారంతో రూ.95 లక్షల వ్యయంతో నిర్మించిన ఏసీ కళ్యాణ మండపాన్ని సోమవారం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు, సహకార సంఘ చైర్పర్సన్ చెరుకూరి రాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థలదాత కీర్తిశేషులు జొన్నలగడ్డ శంకరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం రూ.40 లక్షల ఎంపీ నిధులతో నిర్మించనున్న వడ్డెర కమ్యూనిటీ హాల్కు భూమిపూజ నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో జరిగిన సభలో చెరుకూరి రాజేశ్వరరావు మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు లభించే ప్రయోజనాలను వివరించారు. అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ నాయకులతో వ్యవహరిస్తున్న తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు ఏఎంసీ చైర్పర్సన్ రేగళ్ల లక్ష్మీ అనిత–వీరారెడ్డి దంపతులు, మాజీ మండల అధ్యక్షుడు యనమద్ది పుల్లయ్య చౌదరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవభక్తుని సీతారాం ప్రసాద్, మాజీ సర్పంచులు చావా నిర్మల, కోట పుల్లమ్మ, టీడీపీ నాయకులు దిరిశాల వెంకట కృష్ణారావు, కందిమళ్ల శేషగిరిరావు, మానుకొండ రామకృష్ణ, దుబ్బాకు వెంకటేశ్వర్లు, సీపీఎం నాయకుడు నందిగామ జనార్ధన చారి, జనసేన నాయకుడు చింతలపాటి వెంకటకృష్ణ, బ్యాంకు చీఫ్ మేనేజర్ తెనాలి శ్రీనివాసరావు, విశ్రాంత బ్యాంకు మేనేజర్ దేవరపల్లి రమేష్, వివిధ గ్రామాల సహకార సంఘాల ఉద్యోగులు, చైర్పర్సన్లు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.