మంత్రి చొరవతో పోలిమేర రహదారి పనులకు ఊరట.. రైతుల హర్షం
చాట్రాయి–విసన్నపేట మండలాల మధ్య ఉన్న పోలిమేర రహదారి నిర్మాణ పనులు కంకర కొరతతో నిలిచిపోయిన నేపథ్యంలో శనివారం రాత్రి నూజివీడు టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము ఆధ్వర్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార–ప్రజాసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధిని కలిసి సమస్యను వివరించారు.
సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి తిరువూరు నియోజకవర్గ అధికారులతో మాట్లాడి, విసన్నపేట మండల పరిధిలోని కొత్తచెరువు నుంచి రహదారి నిర్మాణానికి అవసరమైన కంకర తరలించేందుకు అనుమతులు ఇప్పించారు. దీంతో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఈ సందర్భంగా రైతులు మంత్రి కొలుసు పార్థసారధికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 300 ఎకరాల ఆయకట్టుకు సరైన దారి లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సొంత నిధులతో రహదారి నిర్మాణం చేపట్టినా మధ్యలో పనులు నిలిచిపోవడంతో నిరాశకు గురయ్యామని తెలిపారు. మంత్రి చొరవతో సమస్య పరిష్కారం కావడంతో రహదారి నిర్మాణం పూర్తవుతుందనే ఆశ కలిగిందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, రైతులు దార్ల వెంకటేశ్వరరావు, బూబత్తుల రాము, బూబత్తుల ప్రసాద్, మిద్దె చెన్నారావు, బూబత్తుల లక్ష్మణరావు, చీపి చంటి, నక్కా చెన్నారావు, దార్ల సర్వేశ్వరరావు పాల్గొన్నారు.