యూపీ బస్సు ప్రమాదం.. పల్నాడు యాత్రికుల కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తం
యూపీ బస్సు ప్రమాదం.. పల్నాడు యాత్రికుల కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తం
ఉత్తరప్రదేశ్లోని సితాపూర్ సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికులను సురక్షితంగా స్వగ్రామాలకు చేర్చేందుకు పల్నాడు జిల్లా యంత్రాంగం ముమ్మర చర్యలు చేపట్టింది. ప్రమాదానికి గురైన బస్సులో నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాలకు చెందిన 61 మంది యాత్రికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, స్వల్ప గాయాలతో బయటపడిన నలుగురికి లక్నో ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మిగతా యాత్రికులందరినీ లక్నోలోని ఆనంద్ ఆశ్రమంలో సురక్షితంగా ఉంచి, అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.
బాధితులను వీలైనంత త్వరగా రాష్ట్రానికి తరలించేందుకు పల్నాడు జిల్లా అధికారులు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తున్నారు. యాత్రికుల పూర్తి వివరాలను ఇప్పటికే ఏపీ భవన్ సిబ్బందికి అందజేసి, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇక ప్రమాద సమాచారం తెలుసుకునేందుకు, బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు జిల్లా కలెక్టరేట్లో 24 గంటల ప్రత్యేక హెల్ప్లైన్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ నాగిరెడ్డి పర్యవేక్షణలో పనిచేస్తున్న 9154959291 నంబర్ను సంప్రదించి సమాచారం పొందవచ్చని జిల్లా యంత్రాంగం వెల్లడించింది.
ఈ ఘటనతో పల్నాడు జిల్లాలో ఆందోళన నెలకొనగా, యాత్రికుల సురక్షిత రాక కోసం కుటుంబ సభ్యులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.