యూపీఎస్సీలో 50వ ర్యాంక్తో ఐఎఫ్ఎస్ సాధించిన జయ అశ్వంత్ రెడ్డికి ఘన సత్కారం
విజయవాడ: యూపీఎస్సీ పరీక్షల్లో ప్రతిభ చాటుతూ 50వ ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికైన జయ అశ్వంత్ రెడ్డిని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న బండి ఉమా మహేశ్వర రెడ్డి, వందన దంపతుల కుమారుడు జయ అశ్వంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో ఆల్ ఇండియా 50వ ర్యాంక్ సాధించి ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసిన జయ అశ్వంత్ రెడ్డిని దుశ్శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
అలాగే, తన కుమారుడి విజయానికి కృషి చేసిన తల్లిదండ్రులు బండి ఉమా మహేశ్వర రెడ్డి, వందనలను కూడా కమిషనర్ ప్రశంసించారు. కర్నూలులో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన జయ అశ్వంత్ రెడ్డి, హైదరాబాద్లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివి సివిల్స్కు సిద్ధమవుతూ ఈ ఘన విజయాన్ని సాధించారు.
ఈ సందర్భంగా అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత కూడా జయ అశ్వంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ సరిత, ఏసీపీ ఉమా మహేశ్వర రెడ్డి, వందన తదితరులు పాల్గొన్నారు.
కృషి, పట్టుదల ఉంటే లక్ష్యం ఎంత పెద్దదైనా సాధించవచ్చని జయ అశ్వంత్ రెడ్డి మరోసారి నిరూపించారని పోలీసు అధికారులు కొనియాడారు.