12 ఏళ్లకే ఏఐ కంపెనీ.. సత్తా చాటుతున్న బాలిక
మానా జంపాల అనే 12 ఏళ్ల బాలిక తన ప్రతిభతో వ్యాపార, సాంకేతిక రంగాలను ఆకర్షిస్తోంది. చిన్న వయసులోనే కృత్రిమ మేధస్సు రంగంలో అడుగుపెట్టి సొంతంగా సంస్థను స్థాపించింది.
మానా తొమ్మిదేళ్ల వయసులోనే పైథాన్ కోడింగ్ నేర్చుకుంది. పదేళ్ల వయసులో సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించింది. 11 ఏళ్ల వయసులోనే కృత్రిమ మేధస్సు ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రారంభించింది. ప్రస్తుతం ‘వోక్సా’ పేరుతో సొంత సంస్థను ఏర్పాటు చేసి వ్యాపార రంగంలో తన ప్రతిభను చాటుతోంది.
వోక్సా సంస్థ కెనడా, భారత్, కంబోడియా తదితర దేశాల్లోని వ్యాపార సంస్థలకు కృత్రిమ మేధస్సు ఆధారిత సేవలను అందిస్తోంది. వినియోగదారుల ఫోన్ కాల్స్కు సమాధానం ఇవ్వడం, రోజువారీ పనులను స్వయంచాలకంగా నిర్వహించడం వంటి సేవలను అందిస్తూ వ్యాపార సంస్థల పనిభారాన్ని తగ్గించేందుకు సహకరిస్తోంది.
కేవలం 12 ఏళ్ల వయసులోనే సాంకేతిక రంగంలో సంస్థను స్థాపించి, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలకు సేవలు అందిస్తున్న మానా జంపాల ప్రతిభ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.