www.ntodaynews.com
హనుమకొండ విద్యాశాఖలో పారదర్శకతపై పెద్ద ప్రశ్న
తెలంగాణ
సమాచార హక్కు చట్టం ఉందా… లేదా?
హనుమకొండ విద్యాశాఖలో పారదర్శకతపై పెద్ద ప్రశ్న
NTODAY NEWS: ఆర్టీఐ
దేశ ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలపై ప్రశ్నించే హక్కును కల్పించిన గొప్ప చట్టం సమాచార హక్కు చట్టం – 2005 (RTI Act). కానీ ఈ చట్టం కేవలం పుస్తకాలకే పరిమితమైపోయిందా? హనుమకొండ జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న పరిణామాలు ఇదే అనుమానాన్ని బలపరుస్తున్నాయి.
డ్రాయింగ్ & క్రాఫ్ట్ పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్ల నియామకాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోరుతూ ఒక నిరుద్యోగ అర్హత కలిగిన యువకుడు RTI దరఖాస్తు చేస్తే… సమాధానం రావడం లేదు. గడువు దాటిపోయింది. అప్పీల్ పెట్టినా స్పందన లేదు. ఇది నిర్లక్ష్యమా? లేక ఉద్దేశపూర్వక దాచివేతా?
సమాచారమే నేరమైపోయిందా?
ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రజాధనం వినియోగం వంటి అంశాలు ప్రజలకు తెలియాల్సినవే. అర్హతలు ఏమిటి? నియామక విధానం ఏమిటి? ఎవరి అనుమతితో, ఏ ప్రాతిపదికన నియామకాలు జరిగాయి?
ఇవన్నీ చెప్పకపోవడం ద్వారా అధికారులు ఏం రక్షించాలనుకుంటున్నారు?
RTI చట్టం సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. కానీ విద్యాశాఖ అధికారులు ఆ చట్టాన్ని పక్కన పెట్టారు. ఇది కేవలం ఒక అభ్యర్థి సమస్య కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే వచ్చిన పరీక్ష.
ఫస్ట్ అప్పీల్కూ విలువ లేకపోతే… ఎలా
RTI చట్టంలో అప్పీల్ వ్యవస్థ ఎందుకు ఉంది?
ఫస్ట్ అప్పీల్ దాఖలైనప్పటికీ ఎలాంటి ఉపశమనం లేకపోవడం, అధికారుల మధ్య మౌన సహకారాన్ని సూచిస్తుందా?
చట్టం ఉల్లంఘన జరిగితే కూడా ఎవరూ ప్రశ్నించకపోతే… RTI చట్టం కాగితపు పులి అవదా?
నిరుద్యోగ యువతకు దెబ్బ
ఈ సమాచారం ఒక వ్యక్తికే కాదు… లక్షలాది నిరుద్యోగ యువతకు సంబంధించినది. నియామకాల్లో పారదర్శకత లేకపోతే అర్హతకు విలువ ఉండదు. న్యాయం ఆశించే యువతకు వ్యవస్థపై నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. సమాచారం దాచడం ద్వారా ఉద్యోగ అవకాశాలపై అనుమానాలు పెరుగుతున్నాయి. అవకతవకలకు తలుపులు తెరుచుకుంటున్నాయి.
ఇప్పుడు ప్రశ్న – సమాచార కమిషన్ ఏమి చేస్తుంది?
బాధితుడు చివరకు రాష్ట్ర సమాచార కమిషన్ను ఆశ్రయించాడు.
ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది.
చట్టాన్ని ఉల్లంఘించిన అధికారిపై జరిమానా విధిస్తారా?
బాధ్యత వహించని అధికారులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా?
లేక ఇది కూడా ఒక ఫైల్గా మిగిలిపోతుందా? చట్టానికి భయపడని అధికారులే అసలు ప్రమాదం.RTI చట్టానికి భయపడని అధికారులు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. సమాచారాన్ని ఇవ్వకపోవడం ఒక చిన్న తప్పు కాదు… అది ప్రజల హక్కును లాక్కోవడం.ఈ కేసు ఒక వ్యక్తి కోసం కాదు.
ఇది RTI చట్టం గౌరవాన్ని కాపాడే పోరాటం.
ఇప్పుడు బంతి రాష్ట్ర సమాచార కమిషన్ కోర్టులో ఉంది. చట్టం మాట్లాడుతుందా… లేక మౌనం కొనసాగుతుందా?
ఆర్టీఐ సతీష్
ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు
7989211956
Follow us on
Website
Facebook
Instagram
YouTube