ఆధార్ సేవలు ఇక మరింత సులభం.. ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ బుక్ చేసుకునే అవకాశం!
ఆధార్ సేవలు ఇక మరింత సులభం.. ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ బుక్ చేసుకునే అవకాశం!
కొత్త ఆధార్ నమోదు చేయించుకోవాలన్నా, ఆధార్లో పేరు, చిరునామా, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ వివరాలు వంటి మార్పులు చేయించుకోవాలన్నా ఇకపై ఆధార్ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ఉచితంగా ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ విధానం ద్వారా ముందుగానే తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నిర్ణయించిన సమయానికి సంబంధిత ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి సేవలు పొందవచ్చు. దీంతో క్యూల్లో వేచి ఉండే సమయం తగ్గడంతో పాటు సేవలు కూడా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి నెలకు గరిష్టంగా రెండు అపాయింట్మెంట్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అపాయింట్మెంట్ బుకింగ్కు ఎలాంటి అదనపు రుసుము ఉండదు. అయితే ఆధార్ నమోదు లేదా వివరాల సవరణకు వర్తించే సేవా ఛార్జీలు యథావిధిగా అమల్లో ఉంటాయి.
దేశవ్యాప్తంగా ఆధార్ సేవా కేంద్రాలు సాధారణంగా ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేస్తాయి. ముందస్తు అపాయింట్మెంట్తో వెళ్లే వారికి సేవలు మరింత సులభంగా, వేగంగా అందేలా ఈ కొత్త సౌకర్యం ఉపయోగపడనుంది.