ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే బియ్యం.. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త!
ఆంధ్రప్రదేశ్లో బియ్యం ధరలు పెరిగి సామాన్యులకు భారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 500 రైస్ మిల్లుల అవుట్లెట్లు, 130 రైతు బజార్లలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి తక్కువ ధరకే బియ్యం విక్రయించనున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఇవి:
సూపర్ ఫైన్ స్టీమ్ రైస్ – కేజీ రూ.52
బీపీటీ గ్రేడ్-1 – కేజీ రూ.50
బీపీటీ గ్రేడ్-2 – కేజీ రూ.48
ప్రస్తుతం మార్కెట్లో సూపర్ ఫైన్ స్టీమ్ రైస్ రూ.62–65, బీపీటీ గ్రేడ్-1 రూ.55–58 వరకు విక్రయమవుతుండగా, ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు కిలోపై రూ.10 వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరలను నియంత్రించి, నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో ప్రజలకు అందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.