ఆగస్టు 15 నుంచి గిగ్ వర్కర్లకు గుడ్న్యూస్.. సంక్షేమ బోర్డు సేవలు ప్రారంభం
ఆగస్టు 15 నుంచి గిగ్ వర్కర్లకు గుడ్న్యూస్.. సంక్షేమ బోర్డు సేవలు ప్రారంభం
తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆగస్టు 15 నుంచి గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు సేవలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ నిర్ణయంతో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, లాజిస్టిక్స్ సిబ్బందితో పాటు యాప్ ఆధారిత సేవలు అందించే సుమారు 5 లక్షల మంది గిగ్ వర్కర్లు ప్రయోజనం పొందనున్నారు.
ఈ చట్టం అమల్లో భాగంగా ప్రతి గిగ్ వర్కర్కు ప్రత్యేక యూనిక్ ఐడీ జారీ చేయనున్నారు. అలాగే అగ్రిగేటర్ సంస్థలు ప్రతి లావాదేవీపై 1 నుంచి 2 శాతం వరకు వెల్ఫేర్ ఫీజును గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డుకు జమ చేయాల్సి ఉంటుంది. ఈ నిధులను వర్కర్ల సంక్షేమం, భద్రత, సామాజిక రక్షణ చర్యలకు వినియోగించనున్నారు.
నిబంధనలను ఉల్లంఘించే అగ్రిగేటర్ సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. తొలి ఉల్లంఘనకు రూ.50 వేల వరకు జరిమానా విధించగా, అదే తప్పు మళ్లీ చేస్తే జరిమానా ఐదు రెట్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి నిబంధనలు, మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు వెల్లడించింది.
ఈ నిర్ణయంతో ఇప్పటివరకు సామాజిక భద్రతకు దూరంగా ఉన్న గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన రక్షణ, సంక్షేమ ప్రయోజనాలు అందే అవకాశాలు మరింత బలపడనున్నాయి.