ఆహార భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి: జిల్లా ఆహార భద్రత అధికారి జి.మహేష్
మంచిర్యాల ప్రతినిధి: జిల్లాలోని హోటళ్ళు, స్వీట్ షాపులు, బేకరీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఆహార భద్రత శాఖ అధికారి జి.మహేష్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని నార్త్ ఇన్ హోటల్ లో వ్యాపార నిర్వాహకులకు ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆహార భద్రత శాఖ డిజిగ్నేటెడ్ అధికారి బి. వాసు రామ్ తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఎలాంటి ఆహార ఉత్పత్తులను తయారు చేయకూడదని హెచ్చరించారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, కేవలం తాజా నిత్యావసర సరుకులను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించిందని, కాబట్టి నిర్వాహకులందరూ ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో వ్యాపార సంస్థలపై నిరంతర తనిఖీలు ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘించి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అవగాహన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని వివిధ హోటళ్ళు, స్వీట్ షాపులు, బేకరీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు చెందిన సుమారు 65 మంది ఆహార వ్యాపార నిర్వాహకులు పాల్గొన్నారు