ఆన్లైన్లోనే ఓటరు వివరాల నమోదు.. ఎన్నికల సంఘం కీలక సూచన
ఆంధ్రప్రదేశ్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2026 (Special Intensive Revision-2026) కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు ఎన్నికల సంఘం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో) కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, ఓటర్లు ఇంటి నుంచే తమ ఓటరు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు లేదా ధృవీకరించుకోవచ్చు. ఇందుకోసం voters.eci.gov.in పోర్టల్ను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఓటర్లు తమ ఈపిక్ (EPIC) నంబర్, ఓటీపీ సహాయంతో లాగిన్ అయి ఇప్పటికే నమోదైన వివరాలను పరిశీలించడంతో పాటు అవసరమైన మార్పులు చేసుకునే అవకాశం ఉంది. అనంతరం పాత రికార్డులతో అనుసంధానం పూర్తి చేసి, ఆధార్ ఈ-సైన్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారమ్ను సురక్షితంగా ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ విధానం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు ఓటరు జాబితాలో వివరాలు మరింత ఖచ్చితంగా నమోదు అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆలస్యం చేయకుండా తమ వివరాలను ధృవీకరించి ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు.