ఆసిఫాబాద్లో ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు.. భూములు వదులుకోమంటూ ఆందోళన
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. జైనూర్ మండలం పులస గ్రామ శివారులో అటవీ భూమిని జేసీబీతో చదును చేసేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
తమ తాతముత్తాతల కాలం నుంచి ఇదే భూముల్లో సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, ఇందుకు సంబంధించిన హక్కు పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు భూములను స్వాధీనం చేసుకోవడానికి వస్తే తమ కుటుంబాలు ఎలా బతకాలని అధికారులను ప్రశ్నించారు.
"మమ్మల్ని అరెస్ట్ చేసినా, చంపినా ఈ భూములను వదులుకోం. మా జీవనాధారం ఇదే. భూములు పోతే ఉపాధి కోల్పోయి కుటుంబాలతో రోడ్డున పడాల్సి వస్తుంది" అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు, రైతులతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.