ఏపీ పౌరసరఫరాల శాఖలో ప్రత్యేక విజిలెన్స్ బృందం.. రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలకు సిద్ధం
అమరావతి:
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో పారదర్శకత పెంపు, అక్రమాలకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ప్రత్యేక విజిలెన్స్ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించేందుకు 12 మంది అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది.
ఈ విజిలెన్స్ బృందం ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీలపై ప్రత్యేక నిఘా ఉంచనుంది. రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయా, మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి అందాల్సిన బియ్యం సకాలంలో అందుతోందా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది.
అలాగే రేషన్ దుకాణాలు, పీడీఎస్ స్టాక్ పాయింట్లు, ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టనుంది. ప్రజలకు అందాల్సిన నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ అవుతున్నాయా, అక్రమ నిల్వలు లేదా మళ్లింపులు జరుగుతున్నాయా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది.
ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం-2 పథకం, అంగన్వాడీ కేంద్రాలు, విద్యార్థి హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం అమలుపైనా విజిలెన్స్ బృందం నిఘా ఉంచనుంది. ఆయా పథకాల కింద సరుకుల సరఫరా, వినియోగం, పంపిణీ విధానాలను పరిశీలించి లోపాలను గుర్తించనుంది.
తనిఖీల్లో బయటపడే అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు, అక్రమాలపై సమగ్ర నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రత్యేక విజిలెన్స్ బృందం సమర్పించనుంది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.