మహేష్ బాబు AMB సినిమాస్తో పాటు మరో ఐదు థియేటర్లకు భారీ జరిమానా
సినిమా టికెట్లపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించినప్పటికీ, టికెట్ల గ్రాస్ రేట్లను పెంచి ప్రేక్షకుల నుంచి అదనపు మొత్తాన్ని వసూలు చేశారన్న ఆరోపణలపై హీరో మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్తో పాటు మరో ఐదు థియేటర్లపై జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ (GSTAT) జరిమానాలు విధించింది.
ఈ కేసులో AMB సినిమాస్కు మొత్తం రూ.1.7 కోట్ల బకాయిలు ఉన్నట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. ఇందులో తొలి విడతగా రూ.35 లక్షలను వెంటనే జమ చేయాలని ఆదేశించింది. అలాగే మిగిలిన మొత్తాన్ని నిబంధనల ప్రకారం చెల్లించాలని సూచించింది.
ఇతర థియేటర్లకు విధించిన జరిమానాలు ఇలా ఉన్నాయి..
జ్యోతి థియేటర్ – రూ.19.8 లక్షలు
భ్రమరాంబ సినిమాస్ – రూ.11.8 లక్షలు
కుమార్ 70MM – రూ.2.5 లక్షలు
ASR సినిమాస్ – రూ.9.6 లక్షలు
విశ్వనాథ్ 70MM – రూ.9 లక్షలు
ఈ మొత్తాలకు అదనంగా 18 శాతం వడ్డీని కలిపి సంబంధిత సంక్షేమ నిధికి చెల్లించాలని GSTAT ఆదేశాలు జారీ చేసింది.
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించకుండా, టికెట్ ధరలను పెంచి అదనపు వసూళ్లకు పాల్పడిన థియేటర్లపై ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.