అక్కపాలెం శివారులో జూద శిబిరంపై పోలీసుల మెరుపు దాడి
అక్కపాలెం శివారులో జూద శిబిరంపై పోలీసుల మెరుపు దాడి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం అక్కపాలెం గ్రామ శివారులో నిర్వహిస్తున్న కోతముక్క జూద శిబిరంపై తిరువూరు పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు తిరువూరు పోలీస్ స్టేషన్ ఎస్సై శాతకర్ణి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించిన దాడిలో కోతముక్క జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి రూ.1,800 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రజలకు పోలీసుల హెచ్చరిక
ప్రభుత్వం నిషేధించిన జూద కార్యకలాపాల్లో పాల్గొనడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. జూదం కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడంతో పాటు సామాజిక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని, ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.