అక్రమ మైనింగ్ నాటి మాట... యువతకు ఉపాధే CBG ప్లాంట్ లక్ష్యం: కొలుసు పార్థసారథి
ఏలూరు/అగిరిపల్లి, జూలై 15: అగిరిపల్లి ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాల లక్ష్యమైతే, పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా అగిరిపల్లిలో రూ.120 కోట్ల వ్యయంతో నితిన్ కృష్ణ కన్స్ట్రక్షన్స్ సంస్థ కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఇందులో రూ.39 కోట్లు ప్రమోటర్ల పెట్టుబడి కాగా, మిగిలిన నిధులు బ్యాంకు రుణాల ద్వారా సమకూరనున్నాయని చెప్పారు. అలాగే నూజివీడు మండలం తుక్కులూరులో రూ.200 కోట్లతో మరో సీబీజీ ప్లాంట్ ఏర్పాటు కానుందని వెల్లడించారు. ఈ రెండు పరిశ్రమల ప్రధాన ఉద్దేశం నూజివీడు నియోజకవర్గ అభివృద్ధితో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడమేనని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా రిలయన్స్ సంస్థ రూ.65 వేల కోట్ల పెట్టుబడితో 500 సీబీజీ యూనిట్లు ఏర్పాటు చేస్తోందని, అయితే ఎక్కడా గ్రామసభలు నిర్వహించలేదని అన్నారు. తమ కుటుంబం మాత్రం సామాజిక బాధ్యతతో గ్రామసభ ఏర్పాటు చేసి ప్రజలకు పరిశ్రమ ప్రయోజనాలను వివరించిందని తెలిపారు. పీ–4 కార్యక్రమం ద్వారా పేదలకు కుట్టు మిషన్లు, పాడి పశువులు అందించిన విషయాన్ని గుర్తు చేశారు.
పరిశ్రమల ద్వారా వచ్చే సీఎస్ఆర్ నిధులతో గ్రామాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్య రంగాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. కానీ ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో సీబీజీ ప్లాంట్ వల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తాయని అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.
సీబీజీ ప్లాంట్లో నేపియర్ గడ్డి, మొక్కజొన్న వ్యర్థాలు, ఆవు పేడ వంటి సేంద్రియ పదార్థాలనే వినియోగిస్తారని, ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే అగిరిపల్లి ప్రజలను పెద్దాపురం, కంచికచర్లలోని సీబీజీ ప్లాంట్లకు తీసుకెళ్లి చూపించామని, అక్కడ దుర్వాసన లేదని ప్రజలే స్వయంగా చూసి వచ్చారని తెలిపారు.
సీబీజీ పరిశ్రమకు అవసరమైన భూమిని మంత్రివర్గమే కేటాయించిందని, ఆ భూమిని అప్పటి వరకు తాను చూసిన దాఖలాలు కూడా లేవని చెప్పారు. తనకు కేటాయించిన భూమి తప్ప అదనంగా ఒక్క ఎకరం కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేటాయించిన భూమిలో చదును పనులు మాత్రమే జరుగుతున్నాయని, దీనిపైనా ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారాలను ప్రస్తావించిన మంత్రి, మాజీ ఎమ్మెల్యే అనుచరుడు బాబూరావుపై అక్రమ మట్టి తరలింపుకు సంబంధించి ఖనిజాల శాఖ రూ.3 కోట్ల జరిమానా విధించిందని గుర్తుచేశారు. అధికారుల విచారణలో మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకే అక్రమ రవాణా చేశానని ఆయన వెల్లడించారని తెలిపారు. అలాగే అమ్మవారిగూడెంలోని గెలాక్సీ మినరల్స్ కంపెనీ 27 ఎకరాలకు అనుమతి తీసుకుని వేలాది ఎకరాల్లో అక్రమంగా మట్టి తవ్వి తరలించిందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు కూడా ఉన్నాయని, పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పరిశ్రమ ఏర్పాటులో భాగంగా చర్చిని తరలించే అంశంపై చర్చ్ పెద్దలతో చర్చించామని, అవసరమైతే మరింత పెద్ద చర్చిని నిర్మిస్తామని ప్రతిపాదించామని చెప్పారు. అయితే వారు ప్రస్తుత స్థలంలోనే కొనసాగించాలని కోరడంతో వారి అభిప్రాయాన్ని గౌరవించి ఎలాంటి మార్పు చేయలేదని తెలిపారు.
అగిరిపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీబీజీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి, ఒకవేళ గ్రామ ప్రజలు అభివృద్ధి వద్దని, తమ యువతకు ఉద్యోగాలు అవసరం లేదని గ్రామసభలో తీర్మానం చేస్తే ఈ పరిశ్రమను మరో ప్రాంతానికి తరలించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
అగిరిపల్లి ఇవాంజెలికల్ మినిస్ట్రీస్ చర్చ్ పాస్టర్ పెదబాబు మాట్లాడుతూ, చర్చ్ అంశంలో మంత్రి పార్థసారథి తమ అభిప్రాయాన్ని పూర్తిగా గౌరవించారని తెలిపారు. చర్చిని యథాతథంగా కొనసాగించేందుకు అంగీకరించడమే కాకుండా, చర్చ్ అభివృద్ధికి కూడా సహకరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు, కొన్ని పత్రికలు కావాలనే ఈ అంశాన్ని వివాదాస్పదంగా మారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.