అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఐటీ ఉద్యోగిని మృతి
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఐటీ ఉద్యోగిని మృతి
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు.
స్థానిక సమాచారం ప్రకారం, దీప ఐటీ ఉద్యోగిగా పనిచేస్తూ న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. భర్తతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనం ఆపిన సమయంలో, గుర్తు తెలియని మరో కారు వేగంగా వచ్చి వారి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీపకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
మృతురాలు ఆమనగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాసరెడ్డి సోదరుడు శ్రీపాతి పుల్లారెడ్డి చిన్న కోడలు.
దీప మృతివార్తతో హైదరాబాద్లోని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆకుతోటపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు.