అమరావతికి రాజ్యసభ ఆమోదం – చింతలపూడిలో ఘన సంబరాలు
అమరావతికి రాజ్యసభ ఆమోదం – చింతలపూడిలో ఘన సంబరాలు
చింతలపూడి, గురువారం: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడంతో చింతలపూడి నియోజకవర్గంలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీలు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ, అమరావతికి రాజ్యసభ ఆమోదం ఐదు కోట్ల ఆంధ్రుల చరిత్రలో సువర్ణాధ్యాయమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రజలకు అంకితం చేయడంలో చేసిన కృషి అపారమని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సేవలు అభివృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు.
రాజ్యసభ ఆమోదంతో అమరావతి శాశ్వత రాజధానిగా అవతరిస్తుందని, రాష్ట్ర ప్రజలందరికీ ఇది గర్వకారణమని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేసే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని గ్రామాల్లో విద్యుత్ దీపాలతో అలంకరణలు చేసి, బాణసంచా కాలుస్తూ, ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాలు జరుపుకున్నారు. చింతలపూడిలో “జై అమరావతి” నినాదాలతో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ ఆకట్టుకుంది.
అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.