అమృత్ 2.0, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనుల్లో వేగం పెంచాలి-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఆయన వెంట బెల్లంపల్లి తహసీల్దార్ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ రమేష్, మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి తదితర అధికారులు ఉన్నారు. పట్టణ ప్రజలకు నిరంతరం త్రాగునీటిని అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అమృత్ 2.0' పథకంలో భాగంగా నిర్మిస్తున్న నీటి ట్యాంకులు, పైపులైన్ల పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే మున్సిపల్ పరిధిలో పారిశుధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని, ప్రతిరోజూ ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పట్టణ అవసరాల దృష్ట్యా నూతన డంపింగ్ యార్డ్ ఏర్పాటు కొరకు ఆయన అధికారులతో కలిసి పలు స్థలాలను పరిశీలించారు. అనంతరం, నిరుపేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ (రెండు పడక గదుల) ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి పేదలకు అందించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు