వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. గురువారం భీమారం మండలంలోని అటవీ ప్రాంతంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. భావితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో.. జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, డీసీపీ ఎ. భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ కిషన్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ మధుసూదన్, ఎఫ్డీఓ సర్వేశ్వర్, సర్పంచ్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
ఈ ఏడాది (2026) వనమహోత్సవంలో జిల్లాకు కేటాయించిన 41 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నూరు శాతం పూర్తిస్థాయిలో సాధించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నర్సరీలలోని మొక్కల వివరాలు, ప్లాంటేషన్ చేసే సైట్ల రిజిస్ట్రేషన్ తదితర సమాచారాన్ని ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయడంతో పాటు, నాటిన వెంటనే మొక్కలకు జియో ట్యాగింగ్ పూర్తి చేసి రోజువారీగా వివరాలను అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. రహదారులకు ఇరువైపులా పెద్ద చెట్లు, పాఠశాలలు, కళాశాలల ఆవరణలో పూలు, పండ్ల మొక్కలు నాటి, నాటిన ప్రతి మొక్కా ఎదిగేలా సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా గనుల కారణంగా జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని, ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటడం ద్వారానే ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచగలమని ఆయన వివరించారు