నీట్-2026 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
ఈనెల 21న పరీక్ష.. హాజరుకానున్న 1,204 మంది అభ్యర్థులు
పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, సీపీ
అధికారుల సమీక్షా సమావేశంలో కలెక్టర్ కుమార్ దీపక్ దిశానిర్దేశం
గతంలో జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా ఈనెల 21వ తేదీన నీట్-2026 పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఎ.భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 1,204 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, వీరి కోసం కాలేజ్ రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజీవ్ నగర్లోని తెలంగాణ ఆదర్శ పాఠశాల-జూనియర్ కళాశాల, జెడ్పీ బాలుర మరియు బాలికల ఉన్నత పాఠశాలల్లో మొత్తం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పరీక్షను అత్యంత సురక్షితమైన వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, మహిళా అభ్యర్థుల తనిఖీ కోసం ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష రోజున ప్రశ్నపత్రాల తరలింపు, భద్రపరచడం, అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
అనంతరం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత అలీలతో కలిసి నీట్ పరీక్ష నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద పారిశుధ్య నిర్వహణ, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రథమ చికిత్స కిట్లు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులు జరుగుతున్న జెడ్పీ బాలికల పాఠశాల వద్ద అదనపు బందోబస్తు ఉంచాలన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, అభ్యర్థులు సకాలంలో చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు. మొబైల్స్, డిజిటల్ పరికరాలను లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సంబంధిత అధికారులను కలెక్టర్ కఠినంగా ఆదేశించారు