ఎల్.పి.జి. వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేసుకోవాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం కింద వంటగ్యాస్ రాయితీని నిరంతరంగా పొందేందుకు వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలను వెంటనే ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఒక ప్రకటనలో కోరారు. చమురు మార్కెటింగ్ సంస్థలతో బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసే ప్రక్రియ జిల్లాలో చురుగ్గా కొనసాగుతోందని, ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు ఈ నెల 30వ తేదీ లోపు తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
నిర్ణీత గడువు ముగిసేలోగా ఆధార్తో బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయని వినియోగదారులకు వంటగ్యాస్ రాయితీ జమ కావడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అదనపు కలెక్టర్ తెలిపారు. అయితే, రాయితీ జమలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆధార్ అనుసంధానంతో సంబంధం లేకుండా వంటగ్యాస్ సరఫరా సేవలు మాత్రం యథావిధిగానే కొనసాగుతాయని వినియోగదారులు గమనించాలని ఆయన వివరించారు.
రేషన్ కార్డుదారులు ఈ - కె వై సి పూర్తి చేయాలి
ఇదే క్రమంలో జిల్లాలోని రేషన్ కార్డుదారులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలనే ఉద్దేశ్యంతో, నకిలీ కార్డులను నిరోధించి రికార్డులను నవీకరించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ-కేవైసీ చేయించుకోని వారు, రేషన్ కార్డులోని సభ్యులందరూ వెంటనే తమ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి, అక్కడి యంత్రాల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు