ఓటర్ల సవరణలో పొరపాట్లకు తావుండొద్దు-జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు ఆదేశం
ఓటర్ల సవరణలో పొరపాట్లకు తావుండొద్దు
బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లాలి
పెండింగ్ రెవెన్యూ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
మంచిర్యాల, బెల్లంపల్లి కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు
జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బి-సెక్షన్ సూపరింటెండెంట్ తో కలిసి మంచిర్యాల ఆర్డీవో (రాజస్వ మండలాధికారి) కార్యాలయం, బెల్లంపల్లి తహశీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఓటర్ల సవరణ, సాదా బైనామా, భూభారతి పెండింగ్ దరఖాస్తులు, భూ సేకరణ తదితర అంశాలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ప్రతి ఇంటికి వెళ్లి విచారణ జరిపేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్యాలయ సిబ్బంది విధిగా సమయపాలన పాటించడంతో పాటు, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్లు జారీ చేయాలని సూచించారు.
రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్షిస్తూ.. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో క్షేత్రస్థాయి విచారణ పకడ్బందీగా చేపట్టి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన 'భూభారతి' పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, విరాసత్ తదితర సర్వీసుల పెండింగ్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలన్నారు. అలాగే భూసేకరణ ప్రక్రియలో భూములు కోల్పోయిన రైతులకు నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా కార్యాలయాల సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు