అన్నారంలో వైభవంగా గంగమ్మ తల్లి వార్షికోత్సవం..
గంగపుత్రుల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం..
డొంకేశ్వర్ (అన్నారం): నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం మహిళలు అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన ఎత్తుకుని, డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాల నడుమ ఊరేగింపుగా బయలుదేరారు. చేపల వలలు, బెలూన్లతో అలంకరించిన ప్రత్యేక పందిరితో ఊరేగింపుగా చెరువు గట్టున ఉన్న గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. మహిళలు ఆలయం చుట్టూ ఐదు మార్లు ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. గ్రామస్తులంతా చల్లగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ఆ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.