అస్సాంలో వరదల బీభత్సం.. 78కి చేరిన మృతుల సంఖ్య
అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం శివసాగర్ జిల్లాలో ఇద్దరు, గోలాఘాట్ జిల్లాలో ఒకరు మృతి చెందడంతో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 78కు చేరింది.
రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఇప్పటికీ మూడు లక్షలకు పైగా ప్రజలు వరద ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 21 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 551 గ్రామాలు నీటమునిగాయి. సుమారు 21,523 హెక్టార్ల వ్యవసాయ భూములు జలమయం కావడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది.
చరాయిదేవు జిల్లా అత్యధికంగా ప్రభావితమై, అక్కడ 1.37 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. శివసాగర్, జోర్హాట్ జిల్లాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం 71 పునరావాస కేంద్రాల్లో 16,500 మందికి పైగా ఆశ్రయం పొందుతుండగా, మరో 72,000 మందికి 30 సహాయ కేంద్రాల ద్వారా నిత్యావసరాలు అందిస్తున్నారు.
వరదలతో రహదారులు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. 11 వేలకుపైగా పశువులు వరదల్లో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రాజధాని గువాహటి సహా కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో పట్టణ వరదల ప్రభావం కొనసాగుతోంది. పడుంబరి, బోరాగావ్, జూ రోడ్, హాతిగావ్ తదితర ప్రాంతాలు ఇంకా నీరు, బురదతో నిండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.