బడిబాటలో ఆదర్శంగా నిలిచిన ఉపసర్పంచ్ కుటుంబం – ప్రభుత్వ పాఠశాలలో పిల్లల చేరిక
బడిబాటలో ఆదర్శంగా నిలిచిన ఉపసర్పంచ్ కుటుంబం – ప్రభుత్వ పాఠశాలలో పిల్లల చేరిక
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో “బడిబాట” కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆదివారం అయినప్పటికీ వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
అనంతరం గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజ్ కుమార్ దంపతులను కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఉపసర్పంచ్ కుటుంబం తమ పిల్లలను వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో చేర్పించి గ్రామానికి ఆదర్శంగా నిలిచారు.
ఈ చర్యతో గ్రామ ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. బడిబాట కార్యక్రమాన్ని గ్రామంలో సాయంత్రం వరకు కొనసాగిస్తూ మరిన్ని తల్లిదండ్రులను చైతన్యపరిచారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి, AAPC చైర్పర్సన్ పులగం సులోచన, ఉపసర్పంచ్ మిర్యాల రాజ్ కుమార్, మాజీ SMC చైర్పర్సన్ కర్రే రాజు, ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, మందుగుల వెంకటయ్య, నకిరేకంటి అశ్విని తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్ మరియు AAPC చైర్పర్సన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.