బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
పట్నా: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఘన విజయం సాధించారు. మూడు దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన బంకీపూర్లో కమలం పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో ఈ ఫలితం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
బంకీపూర్ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు నామినేట్ కావడంతో ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో జన్ సురాజ్ తరఫున బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్, బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించి రాజకీయంగా తన సత్తా చాటారు.
బంకీపూర్ను గత 30 ఏళ్లుగా బీజేపీ తన బలమైన కోటగా నిలబెట్టుకుంది. అలాంటి నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం బిహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు ఎన్నికల వ్యూహకర్తగా పలు పార్టీల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోనూ విజయాన్ని నమోదు చేయడం విశేషంగా మారింది. ఈ గెలుపుతో జన్ సురాజ్ పార్టీకి కొత్త ఉత్సాహం లభించగా, రానున్న బిహార్ రాజకీయాలపై ఈ ఫలితం ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.