బ్రాహ్మణులను కించపరిచిన ఎమ్మెల్యే మందుల సామెల్ వెంటనే క్షమాపణ చెప్పాలి
NTODAY NEWS :- నకిరేకల్
హైదరాబాద్లో జరిగిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ బ్రాహ్మణులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై శ్రీ గాయత్రి వైదిక బ్రాహ్మణ పరిషత్ (నకిరేకల్ నియోజకవర్గం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు నకిరేకల్ లోని స్థానిక సాయి మందిరంలో పరిషత్ సభ్యులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి వైదిక బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ శుభకార్యానికి పిలిపించుకొని, ఆశీర్వచనం తీసుకున్న అనంతరం బ్రాహ్మణులు చదివే మంత్రాలపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడం ధర్మవిరుద్ధమని సభ్యులు మండిపడ్డారు. "నేను ఏదో అన్నాను, మీరు బాధపడకండి" అనే సాకులు కాకుండా, చేసిన తప్పుకు ఎమ్మెల్యే బహిరంగంగా, బేషరతుగా క్షమాపణ చెప్పాలని పరిషత్ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే, బ్రాహ్మణ సంఘాలతో పాటు హిందూ ధార్మిక సంస్థలను కలుపుకొని రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు."హిందూ ధర్మంలో బ్రాహ్మణులకు ఉన్న గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదు.'' శ్రీ గాయత్రి వైదిక బ్రాహ్మణ పరిషత్ ప్రతినిధులు అన్నారు. ఈ కార్యక్రమంలో పగిడిమర్రి మధుసూదన్ శర్మ, వావిలాల రామలింగయ్య శర్మ, దుర్గి మురళీధర్ శర్మ, వంశీ శర్మ, లక్ష్మి ప్రసాద్ శర్మ, గాదె పట్ల భరత్ శర్మ, ఆనంద్, రాంబాబు, చిరంజీవి, నిడికొండ గౌతమ్ శర్మ, నందిబట్ల శేషు శర్మ, పగిడిమర్రి నవీన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.