భగత్ సింగ్ వర్ధంతి వారోత్సవాలు
భగత్ సింగ్ వర్ధంతి వారోత్సవాలు: సిపిఐ(ఎమ్ఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు
చాట్రాయి, మార్చి 24, 2026: సిపిఐ(ఎమ్ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు అధ్యక్షతన నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో కామ్రేడ్ భగత్ సింగ్ 95వ వర్ధంతి వారోత్సవాలలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భగత్ సింగ్ బ్రిటీషర్లతో పోరాడి దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు నాంది పలికారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత ప్రజల సంపద, భూములు, ఆస్తులను కార్పొరేట్లకు అప్పగిస్తూ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు తలొగ్గి దేశానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
అమెరికా-ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్పై కొనసాగిస్తున్న యుద్ధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. యుద్ధానికి వ్యతిరేకంగా, అమెరికా సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కేంద్రం పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. యువత విప్లవ స్పూర్తితో మోదీ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొనాలని కోరారు.
మార్చి 30న “యుద్ధం వద్దు – శాంతి కావాలి” నినాదంతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉదయం 11 గంటలకు నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో గ్యాస్ అందుబాటులో లేకపోవడం, కేంద్ర ప్రభుత్వ అమెరికా అనుకూల విధానాలను ఖండిస్తూ ఈ నిరసన నిర్వహిస్తున్నామని తెలిపారు.
చిత్తపూరు గ్రామంలో వీధిలైట్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని, పేదల సాగుభూములకు పట్టాలు ఇవ్వాలని, అధికారులు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించాలని, స్మశాన భూమి ఆక్రమణలను గుర్తించి సరిహద్దులు నిర్ధారించి ఆక్రమణదారులను తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చాట్ల బాబురావు, కలపాల వెంకటేశ్వరరావు, పల్లెపాము భవాని, వేముల బక్కయ్య, కొత్తపల్లి రాంప్రసాద్, కొత్తపల్లి సోమేశ్వరరావు, చాపల మడుగు ప్రసాదు, ఆరేళ్లి బుజ్జి, బత్తుల బాబు, బత్తుల కిరణ్, కొత్తపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.