విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల అక్రమ అరెస్టులు దుర్మార్గం
విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల అక్రమ అరెస్టులు దుర్మార్గం: సిఐటియు ఖండన
- హామీలు అమలు చేయకుండా భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు
- మంచిర్యాల పీఎస్లో అరెస్టయిన నాయకులను పరామర్శించిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్
- అరెస్టయిన పసుల తిరుపతి, చందం వెంకటేష్, అనిల్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
మంచిర్యాల:విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఉద్యోగులను అర్ధరాత్రి వేళ అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీఐటీయూ మంచిర్యాల జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన 'ఛలో హైదరాబాద్' ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు చర్యల పేరుతో ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి భయాందోళనలు సృష్టిస్తూ స్టేషన్కు తరలించడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో అరెస్టయిన ఆర్టిజన్ ఉద్యోగులను సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే అణచివేత చర్యలకు పాల్పడటం సరికాదని, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని మండిపడ్డారు.
గతంలో నిరవధిక సమ్మె చేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిందని, నేటికీ ఆ హామీలు నెరవేరకపోవడంతోనే ఉద్యోగులు ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని రంజిత్ కుమార్ స్పష్టం చేశారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించిన ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ పసుల తిరుపతి, జేఏసీ కో-కన్వీనర్ చందం వెంకటేష్, ఆర్టిజన్ ఉద్యోగి అనిల్ లతో పాటు మిగతా ఉద్యోగులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే పునరాలోచించి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ చేపట్టే అన్ని రకాల పోరాటాలకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు అందిస్తుందని హెచ్చరించారు