సేవ్ లైవ్స్.. స్టాప్ నీట్ : ఢిల్లీలో కదం తొక్కిన ఎంపీ వంశీకృష్ణ
సేవ్ లైవ్స్.. స్టాప్ నీట్ : ఢిల్లీలో కదం తొక్కిన ఎంపీ వంశీకృష్ణ
- ప్రియాంక గాంధీతో కలిసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరసన
- మన పిల్లల భవిష్యత్తు అమ్మకానికి కాదు!’ అంటూ కేంద్రంపై ఫైర్
న్యూఢిల్లీ:
నీట్ (NEET) పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలు, వైద్య విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. నల్ల దుస్తులు ధరించి నిరసనలో పాల్గొన్న ఆయన, ‘సేవ్ లైవ్స్.. స్టాప్ నీట్’ (Save Lives, Stop NEET), ‘అవర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్ ఈజ్ నాట్ ఫర్ సేల్’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరెత్తించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర వైఖరిని తప్పుబడుతూ కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. నీట్ పరీక్షలు, వైద్య విద్యలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘మన పిల్లల భవిష్యత్తు అమ్మకానికి కాదు’ అని స్పష్టం చేసిన ఆయన, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఉద్ఘాటించారు. విద్యార్థులకు, బాధిత కుటుంబాలకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఆయన తేల్చిచెప్పారు