భగవద్గీత పారాయణంలో బంగారు పతకం సాధించిన చిన్నంపేట వాసి సునీత
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామానికి చెందిన నృసింహాద్రి సునీత భగవద్గీత పారాయణంలో ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించారు. గత ఏడాది కాలంగా మైసూర్ అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో నిర్వహించిన శ్రీమద్భగవద్గీత పారాయణ తరగతుల్లో పాల్గొన్న సునీత, భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలను కంఠస్థం చేసి తన ప్రతిభను చాటుకున్నారు.
ఈ నెల 10వ తేదీన మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో గణపతి సచ్చిదానంద స్వామి సునీతను బంగారు పతకం, ప్రశంసాపత్రంతో ఘనంగా సత్కరించారు.
ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సునీత భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి, అనేక మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.