www.ntodaynews.com
ధర్మపురి పురపోరుకు బీఆర్ఎస్ సమరశంఖం
తెలంగాణ
ధర్మపురి పురపోరుకు బీఆర్ఎస్ సమరశంఖం
NTODAY NEWS: గొల్లపల్లి రిపోర్టర్: లక్ష్మణ్
15 వార్డుల అభ్యర్థుల ప్రకటన – వార్డులవారీగా ఇంచార్జీల నియామకం
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని శ్రేణులకు పిలుపు
రానున్న ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఎన్నికల కసరత్తును వేగవంతం చేసింది. శనివారం ధర్మపురిలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని, మున్సిపాలిటీలోని 15 వార్డులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అలాగే అభ్యర్థుల విజయ బాధ్యతను భుజాన వేసుకునేలా ప్రతి వార్డుకు ప్రత్యేక ఇంచార్జీలను నియమించారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పాలనలో ధర్మపురి పరిస్థితి ఏవిధంగా ఉందో, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతటి అభివృద్ధి సాధించామో ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన తీర్పు ఇచ్చారని, అదే తీర్పు మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతం కావాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల వేళ ప్రలోభాలు – అప్రమత్తంగా ఉండాలి
కాంగ్రెస్ పార్టీ ధనబలం, అధికార బలంతో ఎన్నికలకు వస్తుందని, కానీ బీఆర్ఎస్కు ప్రజల బలం ఉందని ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ధర్మపురి అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్, ఎన్నికల వేళ కొత్త ప్రొసీడింగ్స్ తీసుకురావడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని విమర్శించారు. 2022 వరదల సమయంలో లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ దెబ్బతిన్నా, నెల రోజుల్లోనే పునరుద్ధరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, కష్టకాలంలో పార్టీని వీడినవారిపై ఆందోళన అవసరం లేదన్నారు.
కేసీఆర్ కు నోటీసులపై తీవ్ర స్పందన
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎస్ఐటీ నోటీసులు జారీ చేయడాన్ని రాజకీయ కక్షసాధింపుగా కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. దీనికి నిరసనగా ప్రతి మున్సిపాలిటీలో బైక్ ర్యాలీలు, గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మున్సిపాలిటీ ఇంచార్జి రఘువీర్ సింగ్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, నియోజకవర్గ కన్వీనర్ అయ్యోరి రాజేష్, పట్టణ కన్వీనర్ బండారి రంజిత్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#Dharmapuri
#BRSPolitics
#MunicipalElections
#KoppulaEshwar
#TelanganaPolitics
#WardElections
#GrassrootsPolitics
#PinkFlag
#PoliticalMeeting
Follow us on
Website
Facebook
Instagram
YouTube