ఉద్యోగుల కుటుంబాలకు కొండంత భరోసా
చారిత్రక ఘట్టం: విధి నిర్వహణలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు రూ. కోటి చెక్కుల పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు సీఎం శ్రీ అనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు కలిసి సోమవారం అసెంబ్లీ హాల్లో రూ. కోటి ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు.
ఉద్యోగుల కుటుంబాలకు కొండంత భరోసా:
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే ఇదొక చారిత్రక కార్యక్రమమని కొనియాడారు. విధి నిర్వహణలో ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకూడదన్న మానవీయ ఆలోచనతోనే రూ. 1.20 కోట్ల భారీ ప్రమాద బీమాను అమలు చేస్తున్నామని ప్రకటించారు.
ఈ పథకం ద్వారా విద్యుత్ సంస్థల్లోని 51 వేల మందికి పైగా, సింగరేణిలోని 41 వేల మందికి, మరియు రాష్ట్రంలోని 7.57 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భరోసా లభిస్తుందని వివరించారు.
పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే సింగరేణి, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో సంస్థల్లో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు గుర్తుచేశారు.
లబ్ధిదారుల వివరాలు:
2025 అక్టోబర్ 10న మరణించిన అసిస్టెంట్ లైన్మెన్ వరుస సురేష్ కుటుంబానికి రూ. కోటి చెక్కు అందజేశారు.
2025 ఏప్రిల్ 19న మరణించిన ఆర్టిజన్ ముక్తార్ బేగ్ కుటుంబానికి కూడా రూ. కోటి బీమా చెక్కును అందజేసి ప్రభుత్వం అండగా నిలిచింది.
హాజరైన ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావుతో పాటు గడ్డం వివేక్, అజారుద్దీన్, ఎనర్జీ సెక్రెటరీ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.