చిట్యాలలో మిన్నంటిన బిఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు
చిట్యాలలో మిన్నంటిన బిఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు NTODAY NEWS చిట్యాల
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) 25వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభసందర్భంగా సోమవారం చిట్యాల మండల కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు ఆగు అశోక్ ఆధ్వర్యం లో మాజీ మార్కెట్ చైర్మన్ జడల ఆది మల్లయ్య పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్, నేడు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చేపూరి రవీందర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, కూరెల్ల లింగస్వామి పాల్గొని ప్రసంగించారు. అలాగే కౌన్సిలర్లు ఎస్.కె షబానా అజీముద్దీన్, నిమ్మనగోటి శ్రీను, మారగోని రమేష్, భూలుగూరి సైదులు, వెంపాల వెంకన్న మరియు పార్టీ ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.