చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్: నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, చర్లపల్లి మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అప్రోచ్ రోడ్ల విస్తరణ, భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
నగరంలోని ప్రధాన స్టేషన్లపై భారం తగ్గించేందుకు రూ. 430 కోట్లతో అభివృద్ధి చేసిన చర్లపల్లి టెర్మినల్ మరియు పునరాభివృద్ధి చెందుతున్న సికింద్రాబాద్ స్టేషన్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
లేఖలోని ప్రధానాంశాలు:
చర్లపల్లి రైల్వే టెర్మినల్ అవసరాలు:
రోడ్ల విస్తరణ: FCI గోడౌన్ రోడ్డు నుండి కొత్త స్టేషన్ వరకు రహదారిని 200 అడుగులకు విస్తరించాలి.
భరత్ నగర్ వైపు ఉన్న 30 అడుగుల రోడ్డును 100 అడుగులకు పెంచాలి.
EC నగర్ నుండి MMTS ప్లాట్ఫాం వైపు ఉన్న రోడ్డును 100 అడుగుల వెడల్పు, 700 మీటర్ల పొడవున విస్తరించాలి.
భూసేకరణ: పార్కింగ్ అవసరాల కోసం కొత్త బిల్డింగ్ వైపు 3 ఎకరాలు, MMTS వైపు 2.70 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది.
నీటి సరఫరా: రైల్వే శాఖ ఇప్పటికే రూ. 4 కోట్లు జమ చేసినందున, స్టేషన్కు నీటి కనెక్షన్ త్వరగా పూర్తి చేయాలి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్:
ఉత్తర టెర్మినల్ వైపు ప్రయాణికుల రాకపోకల కోసం ఆల్ఫా హోటల్ నుండి రథీఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగులకు విస్తరించాలని కోరారు.
అధికారుల పరిశీలన జరిగినా అడుగు ముందుకు పడలేదు..
గతంలో పలుమార్లు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసినప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాజెక్టులపై సీఎం వ్యక్తిగత చొరవ చూపి, తక్షణమే భూసేకరణ మరియు రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలని ఆయన కోరారు.