డాక్టర్ అనితా రెడ్డికి గ్లోబల్ విజనరీ ఎంట్రప్రెన్యూరియల్ ఎంపవర్మెంట్ చేంజ్ లీడర్ ఉమెన్ అవార్డు
డాక్టర్ అనితా రెడ్డికి "గ్లోబల్ విజనరీ ఎంట్రప్రెన్యూరియల్ ఎంపవర్మెంట్ చేంజ్ లీడర్ ఉమెన్" అవార్డు
హైదరాబాద్:
గత 30 ఏళ్లుగా సమాజ సేవలో నిస్వార్థంగా కృషి చేస్తున్న అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ కె. అనితా రెడ్డికి ప్రతిష్టాత్మకమైన "గ్లోబల్ విజనరీ ఎంట్రప్రెన్యూరియల్ ఎంపవర్మెంట్ చేంజ్ లీడర్ ఉమెన్ అవార్డు - 2026" లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని ప్రకాశ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో 'మనం ఫౌండేషన్' ఈ అవార్డును ప్రదానం చేసింది.
అనాథలు, దివ్యాంగులు, మహిళలు మరియు వృద్ధుల సంక్షేమం కోసం అనితా రెడ్డి అందిస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.
సేవకు దక్కిన గౌరవం
మనం ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ చక్రవర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి దూరదృష్టితో మహిళా సాధికారతకు కృషి చేస్తూ, సమాజంలో మార్పుకు నాయకత్వం వహిస్తున్న విశిష్ట మహిళలకు ఈ అవార్డును అందజేస్తామని పేర్కొన్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న అనితా రెడ్డిని ఈ అవార్డుకు ఎంపిక చేయడం తమ సంస్థకు గర్వకారణమని ఆయన తెలిపారు.
బాధ్యత పెరిగింది: డాక్టర్ అనితా రెడ్డి
అవార్డు గ్రహీత డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ, తన సేవలకు గుర్తింపుగా ఈ అంతర్జాతీయ స్థాయి అవార్డు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తనపై బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ అవసరార్థులకు అండగా ఉంటానని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మనం ఫౌండేషన్ ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.