దేశీయ మార్గాల్లో ‘బేసిక్ ఫేర్’ టికెట్లు ప్రవేశపెట్టిన ఎయిరిండియా
దేశీయ ప్రయాణికులకు తక్కువ ధరలో విమాన ప్రయాణాన్ని అందించేందుకు Air India కొత్త ఆఫర్ను తీసుకొచ్చింది. ఎంపిక చేసిన దేశీయ రూట్లలో ‘బేసిక్ ఫేర్ ఫ్యామిలీ’ పేరుతో చౌక టికెట్లను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది.
ఈ ఆప్షన్ కింద ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేయవచ్చు. 15 కిలోల చెక్-ఇన్ బ్యాగేజీ, 7 కిలోల క్యాబిన్ బ్యాగేజీ అనుమతి ఉంటుంది. అయితే ఉచిత భోజనం ఉండదు. బదులుగా టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ వంటి తేలికపాటి పానీయాలు మాత్రమే అందిస్తారు.
ప్రయాణికులు అవసరమైతే ముందుగానే లేదా ప్రయాణానికి 24 గంటల లోపు ప్రత్యేక మీల్స్ను బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. శాకాహారం, మాంసాహారం, జైన్, డయాబెటిక్ మీల్స్ వంటి ఎంపికలు అందుబాటులో ఉంటాయి.
బేసిక్ ఫేర్తో పాటు వాల్యూ, క్లాసిక్, ఫ్లెక్స్ వంటి ఇతర ఛార్జ్ శ్రేణులు కూడా కొనసాగుతాయి. వీటిలో భోజనం సహా అదనపు ప్రయోజనాలు ఉంటాయి. వినియోగదారుల స్పందన ఆధారంగా ఈ కొత్త టికెట్ విధానం కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.