దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం.. పచ్చదన దిశగా భారత రైల్వేకు మరో మైలురాయి
దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం.. పచ్చదన దిశగా భారత రైల్వేకు మరో మైలురాయి
భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. దేశంలోనే తొలి స్వదేశీ హైడ్రోజన్ ఇంధన రైలును ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. ఈ రైలు జింద్–సోనిపత్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో ఉత్తర రైల్వే పరిధిలో ప్రయోగాత్మకంగా నడవనుంది. ఈ ప్రాజెక్టుతో హైడ్రోజన్ ఇంధన రైళ్లను నడుపుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది.
ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో పనిచేస్తుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ రసాయనిక చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. నీటి ఆవిరి మాత్రమే వెలువడటంతో ఇది పర్యావరణ హిత రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందింది.
ఈ రైలులో మొత్తం 10 కోచ్లు ఉండగా, సుమారు 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉంది. గరిష్ఠ నిర్వహణ వేగం గంటకు 75 కిలోమీటర్లు. జింద్–సోనిపత్ మధ్య ప్రయాణాన్ని సుమారు రెండు గంటల్లో పూర్తి చేస్తుంది. మార్గమధ్యంలో 11 స్టేషన్లలో ఆగుతుంది.
ప్రయాణికులకు అందుబాటు ధరల్లో ప్రయాణం కల్పించేందుకు టికెట్ ఛార్జీలు రూ.5 నుంచి రూ.25 వరకు నిర్ణయించారు. తక్కువ ఖర్చుతో, కాలుష్య రహిత ప్రయాణాన్ని అందించే ఈ రైలు భారత రైల్వేలో హరిత సాంకేతికతకు నాంది పలుకుతుందని అధికారులు తెలిపారు.