సైబర్ బాధితులకు తీపికబురు.. 'మనీ రిస్టోరేషన్ మాడ్యూల్'తో డబ్బు వాపస్
సైబర్ మోసాలకు గురై డబ్బు కోల్పోయిన బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో శుభవార్త తెలిపింది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు తమ సొమ్మును సులభంగా తిరిగి పొందేందుకు 'మనీ రిస్టోరేషన్ మాడ్యూల్'ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి రీఫండ్కు సంబంధించిన ఎస్ఎంఎస్ లేదా నోటిఫికేషన్ అందుకున్న బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లోని ఈ మాడ్యూల్ ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. చట్ట అమలు సంస్థలు, సంబంధిత బ్యాంకులు సంయుక్తంగా ధృవీకరించిన అనంతరం అర్హులైన బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రీఫండ్ నగదు జమ కానుంది. దీంతో సైబర్ మోసాల్లో చిక్కుకుని డబ్బు కోల్పోయిన వారికి త్వరితగతిన న్యాయం జరిగే అవకాశం ఏర్పడింది.
రీఫండ్ కోసం దరఖాస్తు చేసే విధానం
సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా బాధితులు సులభంగా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా సైబర్ ఫిర్యాదుకు అనుసంధానమైన మొబైల్ నంబర్తో పోర్టల్లో లాగిన్ కావాలి. అనంతరం మొబైల్కు వచ్చిన ఓటీపీ ద్వారా గుర్తింపును ధృవీకరించాలి. ఆ తర్వాత అర్హత కలిగిన ఫిర్యాదును, సంబంధిత బ్యాంకు ఖాతాను ఎంపిక చేసుకోవాలి. అవసరమైతే పాన్ కార్డు వివరాలను అప్లోడ్ చేయాలి. అనంతరం రీఫండ్కు సంబంధించిన వివరాలను మరోసారి పరిశీలించి దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తు విజయవంతంగా నమోదైనట్లు నిర్ధారణ సందేశం వచ్చిన తర్వాత అధికారులు, బ్యాంకులు పరిశీలన పూర్తి చేసి అర్హులైన బాధితుల ఖాతాల్లోకి నేరుగా రీఫండ్ నగదు జమ చేయనున్నారు.