కంఠమహేశ్వర దేవాలయ హుండీలో చోరీ
చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో గౌడ సామాజిక వర్గీయుల ఆరాధ్య దైవమైన కంఠమహేశ్వర స్వామి దేవాలయం తాళాలు పగులగొట్టి హుండీలోని నగదు చోరీ చేశారు. సుమారు రూ.10 వేలు దోచుకున్నట్లుగా గ్రామస్థులు తెలిపారు. గతంలో కూడా ఈ దేవాలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఈ హుండీతో పాటు పక్కనే ఉన్న కనకదుర్గ దేవాలయంలో కూడా దుండగులు చోరీకి ప్రయత్నించారని స్థానికులు తెలిపారు. గతంలో చిలుకూరు కాల్వ ఒడ్డు అభయాంజనేయ స్వామి, బస్టాండ్ సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయాల్లో కూడా ఇలాంటి చోరీలు జరిగాయి. దేవాలయ చోరీలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కంఠమహేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఛైర్మన్ సురగాని వెంకటేశ్వర్లు, గ్రామస్థులు కోరుతున్నారు.