ధాన్యాన్ని తక్షణమే తరలించి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు
జిల్లాలో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని తక్షణమే తరలించి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులకు తెలిపారు. ఆదివారం ఆయన జిల్లాలోని కోటపల్లి మండలం దేవులవాడ, వేమనపల్లి మండలం గొర్లపల్లి గ్రామాలలో సొసైటీల ఆధ్వర్యంలో, అలాగే దస్నాపూర్ గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని త్వరగా రైస్ మిల్లులు, గోదాములకు తరలించి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని వివరించారు. ధాన్యం తరలింపు కోసం అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచుకోవాలని ఆయన తెలిపారు.
అనంతరం వేమనపల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో కలిసి ధాన్యం తరలింపునకు కావలసిన లారీల సౌకర్యాన్ని పరిశీలించారు. రవాణా కాంట్రాక్టర్లతో ఫోన్ ద్వారా మాట్లాడి అదనపు లారీలను ఏర్పాటు చేయాలని, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని అత్యవసరంగా ఈరోజు రాత్రి కల్లా తరలించి జిల్లాలో కొనుగోలు ప్రక్రియ ముగిసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు